ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడ కట్టనని చెప్పినా వినలేదు.. ఒత్తిడి చేశారు: సింహాచలం కాంట్రాక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 08:25 PM

సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. చందనోత్సవం సందర్బంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకుందామని వచ్చిన భక్తులు.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పన్న నిజరూప దర్శనం రోజున తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. రాష్ట్రం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వం కూడా విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు కాంట్రాక్టర్ లక్ష్మణరావు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కమిటీ క్షేత్ర స్థాయి విచారణలో లక్ష్మణరావు షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


సింహాచలం దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ కింద అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారు. 2023లో టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. అనంతరావు అండ్‌ కో కంపెనీ పేరు మీద కాంట్రాక్టర్ లక్ష్మణరావు రూ.54.04 కోట్ల అంచనాతో సింహాచలం ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే లక్ష్మణరావు కాంట్రాక్టర్‌గా నిర్మించిన గోడ కూలి ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. అయితే చందనోత్సవానికి సమయం చాలా తక్కువగా ఉందని.. తాను గోడ కట్టనని చెప్పానని కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్తున్నారు. అయినా కూడా అధికారులు బలవంతంగా ఆ గోడను కట్టించారని విచారణ కమిటీ సభ్యులకు తెలియజేశారు.


సింహాచలం దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులు బలవంతంగా గోడ కట్టించారని కాంట్రాక్టర్ లక్ష్మణరావు తెలిపారు. 6 రోజుల వ్యవధిలో గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని.. అధికారుల బలవంతంతో చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందే గోడ పనులు మొదలు పెట్టినట్లు వివరించారు. తాత్కాలిక గోడ అని చెప్పడంతోనే గోడ పనులు చేపట్టినట్లు కాంట్రాక్టర్ కమిటీ అధికారుల ముందు తన వాదన వినిపించారు. మరోవైపు గోడ కట్టే సమయంలో ఇంజినీర్‌ లేరని కాంట్రాక్టర్‌ చెప్పగా, ఇంజినీర్‌ అక్కడే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో విచారణ కమిటీ అధికారులు అయోమయంలో పడినట్లు తెలిసింది.


మరోవైపు సింహాచలం చందనోత్సవం సందర్భంగా రూ.300 టికెట్‌ కౌంటర్‌ క్యూలైన్ వద్ధ ఉన్న గోడ కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు చనిపోయారు. మృతుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. అయితే ఈ గోడను నాసిరకంగా నిర్మించడం వలనే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో సింహాచలం ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa