ఉపాధి హామీ కూలీలకు ఏపీ ప్రభుత్వం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు ప్రమాద బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరికి ప్రధానమంత్రి జీవిత బీమా కల్పించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉపాధి హామీ కూలీలను ఇకపై ఉపాధి హామీ శ్రామికులుగా పిలవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పని ప్రదేశంలో వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు. అలాగే పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి అందించే పరిహారం మొత్తాన్ని కూడా రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎస్బీఐతో ఏపీ పంచాయతీరాజ్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
కార్మికుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్.. ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రం, దేశానికి ఒక వరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందని పవన్ అన్నారు. ఉపాధి హామీ పథకం కారణంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 75 లక్షల 23 వేల మంది సొంతూర్లలోనే ఉపాధి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. రక్తం ధారపోసి పనిచేసేవారు లేకపోతే ఏ నిర్మాణం జరగదని.. అందుకే ఇకపై ఉపాధి హామీ కూలీలని కాకుండా ఉపాధి హామీ శ్రామికులుగా పిలుద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇకపై ప్రభుత్వం, అధికారులే కాకుండా మీడియా కూడా ఉపాధి కూలీలని కాకుండా ఉపాధి శ్రామికులుగా పిలవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఎండ తీవ్రత కారణంగా చాలా మంది ఉపాధి శ్రామికులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి శ్రామికులు ఉదయం 11 గంటల్లోపు పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ పనులు పెండింగ్లో ఉంటే సాయంత్రం నాలుగు తర్వాత చేసేలా చూడాలని సూచించారు. ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో నీడ కోసం చిన్న పాకలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉపాధి శ్రామికుల ప్రమాద బీమా కోసం స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa