ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మే రెండో తేదీన ప్రధానమంత్రి మోదీ అమరావతికి రానున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అమరావతి పునఃప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఇక అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను వారి ఇళ్లకు వెళ్లి.. బొట్టు పెట్టి మరీ అమరావతి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రారంభోత్సవం నేపథ్యంలో అమరావతి పునఃప్రారంభోత్సవం ఆహ్వాన పత్రిక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారుతుందనేలా ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఆహ్వాన పత్రిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు ఉంచారు. అలాగే అమరావతి స్థూపం, అమరావతి నగరానికి సంబంధించిన ఊహా చిత్రం ఉంది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు లేదంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా జనసైనికులు సోషల్ మీడియా వేదికగా అమరావతి ఆహ్వాన పత్రికపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పేరు లేకుండా అమరావతి ఆహ్వాన పత్రిక ఉండటం ఏమిటంటూ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అధినేతకు తగిన గౌరవం ఇవ్వాలంటూ జనసైనికులు మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం, అమరావతి రైతుల కోసం నిలబడిన తమ అధినేతకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలికేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు అమరావతి ఆహ్వాన పత్రికలో మార్పులు చేర్చారు. కొత్తగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అమరావతి ఆహ్వాన పత్రికలో చేర్చారు. పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో పాటుగా.. దిగువన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును చేర్చారు. ఇక ఈ ఆహ్వాన పత్రికలను అందించి అతిథులను, రాజకీయ ముఖ్యులను అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాలకు ప్రధాని మోదీ అమరావతి చేరుకుంటారు. సుమారుగా గంటా 20 నిమిషాల పాటు ప్రధాని అమరావతిలో ఉంటారని తెలిసింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa