ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలయాపన చేశారే తప్ప, రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1,631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తుచేసుకున్నారు. "నాడు 8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి 80 ఏళ్ళ వృద్ధుల వరకూ జై అమరావతి అంటూ జెండా పట్టారు. జై అమరావతి అన్నందుకు అనాడు రైతులకు సంకెళ్లు వేసారు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు మహిళా రైతుల్ని పోలీసుల బూటు కాలితో తన్నించారు. అమరావతి ఉద్యమంలో 270 మంది రైతులు చనిపోయారు. 3 వేల మంది పై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారు" అని వివరించారు.ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. "ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa