కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు."అవును నాకు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చాం. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఇటీవల మంగళూరులో జరిగిన బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య ఘటనపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఈ హత్య కేసులో ప్రమేయమున్న నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి, అరెస్టు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.మంగళూరులో సుహాస్ శెట్టిని నడిరోడ్డుపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మంగళూరులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞలు విధించి, ప్రజలు గుంపులుగా గుమిగూడటాన్ని, ఊరేగింపులు, నినాదాలు చేయడాన్ని నిషేధించారు. సుహాస్ను పథకం ప్రకారమే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa