ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అందుబాటులోకి 6 వరుసల నేషనల్ హైవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 08:28 PM

ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన తర్వాత ఏపీలో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి, విశాఖలో యూనిటీ మాల్‌కు, అలాగే రాష్ట్రంలో రూ.3,716 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3680 కోట్లతో ఇప్పటికే నిర్మాణం పూర్తైన 8 జాతీయ రహదారులను ప్రారంభించారు. రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన జాతీయ రహదారులతో నాయుడుపేట- రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి కూడా ఉంది. 2016లో భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం నాయుడుపేట రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకూ 57 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని నిర్ణయించారు. రూ.2,510 కోట్లతో 2020లో పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2025 జనవరి ఆఖరి నాటికి పనులు పూర్తయ్యాయి. వాహనాల రాకపోకలను కూడా లాంఛనంగా ప్రారంభించారు.


నాయుడుపేట- రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి.. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలోని నాయుడుపేట వద్ద మొదలవుతుంది. శ్రీకాళహస్తి మీదుగా కడప-చెన్నై రహదారి సమీపంలోని రేణిగుంట వద్ద ముగుస్తుంది. ఈ రహదారిని వలయాకారంగా నిర్మించారు. అలాగే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కార్లు, 80 కిలోమీటర్ల వేగంతో బస్సులు, లారీలు దూసుకెళ్లేలా నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిని నిర్మించారు. నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా శ్రీకాళహస్తి సమీపంలో స్వర్ణముఖినదిపై కొత్త వంతెన, మార్గమధ్యలో మరో ఏడు బ్రిడ్జిలు, పది ఆర్వోబీలు నిర్మించారు. ఈ జాతీయ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa