అడ్మిషన్ ఫీజు.. యాక్టివిటీస్ ఫీజు.. ఎగ్జామ్ ఫీజు.. ట్యూషన్ ఫీజు.. అదేదో సినిమాలో ఎల్బీ శ్రీరామ్ నోరు తెరిస్తే అప్పు.. అడుగు వేస్తే అప్పు అన్నట్లుగా నోరు తెరిస్తే ఫీజు, అడుగు వేస్తే ఫీజు అన్నట్లుగా తయారైంది ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ పాఠశాల పరిస్థితి. మరీ కార్పొరేట్ స్కూళ్లల్లో అయితే ఫీజుల దోపిడీ మామూలుగా ఉండదు. కానీ భయపడుతూనే హారర్ సినిమాలు చూసినట్లు.. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే సగటు మధ్యతరగతి జీవి.. అప్పూసొప్పైనా చేసి పిల్లలను ప్రైవేట్ బడికి పంపుతుంటాడు. అమ్మానాన్నా ఇలా బాధ్యతలు తీసుకుంటే సరి.. కానీ తల్లిదండ్రులు లేని వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికి అండగా నిలుస్తోంది ఓ విద్యాసంస్థ. రూపాయి ఫీజు లేకుండానే అనాథ పిల్లలకు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఉచితంగా విద్యాబోధన అందిస్తోంది. విద్యాబోధన, యూనిఫామ్, భోజనం, పుస్తకాలతో పాటుగా వసతి సదుపాయాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది.
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులోని నిరక్షరాస్యులైన పిల్లల విద్య (నైస్) అనే విద్యాసంస్థ అనాథ చిన్నారులకు ఉచితంగా విద్యాబోధన అందిస్తోంది. అలాగే వసతి కూడా అందిస్తోంది. అమ్మానాన్న ప్రేమకు దూరమైన అనాథలను అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆ చిన్నారుల బంగారు భవితకు బాటలు పరుస్తోంది. 2003 ఆగస్టు 15వ తేదీన పోపూరి పూర్ణచంద్రరావు నైస్ విద్యాసంస్థను మైనంపాడులో ప్రారంభించారు. ఈ 23 ఏళ్లలో వందల మంది చిన్నారులకు విద్యను అందించారు. దాతల సాయంతో 20 ఏళ్లుగా నైస్ విద్యాసంస్థ ఎంతోమంది అనాథ చిన్నారులకు అండగా నిలుస్తోంది.
విద్యార్థులకు బోధనతో పాటుగా హాస్టల్స్కు కూడా ఏర్పాటు చేశారు. సీబీఎస్ఈ విద్యాబోధనను ఇక్కడ అందిస్తుండటం విశేషం. కేవలం పాఠాలు మాత్రమే చెప్పడం కాదు.. విద్యార్థుల కోసం కంప్యూటర్, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు ఉన్నాయి. అలాగే సుమారు 4 వేల పుస్తకాలతో లైబ్రరీ అందుబాటులో ఉంది. ఇక విద్యార్థులు ఆడుకోవటం కోసం మైదానం కూడా అందుబాటులో ఉంది. అలాగే బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ వంటి ఆటలు.. ఇండోర్ గేమ్స్పైనా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో 150 మంది విద్యార్థుల వరకూ చదువుకుంటున్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనాథ పిల్లలకు నైస్ విద్యాసంస్థలో ప్రవేశాలకు తొలి ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత తల్లిని కోల్పోయిన ప్రాధాన్యం ఉంటుంది. మూడో ప్రాధాన్యంగా తండ్రిని కోల్పోయిన చిన్నారులను విద్యాసంస్థలో చేర్చుకుంటారు. అయితే 5, 6 తరగతుల్లోనే ఇందులో ప్రవేశాలుంటాయి. ఐదో తరగతిలో చేరాలంటే పదేళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు చేసిన తర్వాత చిన్నారులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం నైస్ విద్యాసంస్థలో ప్రవేశం కల్పిస్తారు. ఇక నైస్ విద్యాసంస్థలో దరఖాస్తు చేయడానికి పిల్లల ఆధార్కార్డుతో పాటుగా, తల్లిదండ్రుల డెత్ సర్టి్ఫికేట్ తప్పనిసరి అని నైస్ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. ఇక ప్రవేశాల కోసం మే నెల నాలుగో ఆదివారం, జూన్ మొదటి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏ ప్రాంతం వారైనా నైస్ విద్యాసంస్థలో ప్రవేశాలకు అర్హులే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa