ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థ.... వచ్చే మార్చిలో ప్రారంభం.!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 08:45 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సందర్భంగా అమరావతిని మూడేళ్లలోగా పూర్తి చేస్తామని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమరావతి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక ప్రధానమంత్రి కూడా అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని.. ఏపీ ప్రభుత్వానికి భుజం కాస్తామంటూ భరోసా ఇచ్చారు.


ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. మరోవైపు తుళ్లూరులో రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోరెన్సిక్ ప్రయోగశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభోత్సవానికి అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిద్ధమవుతోంది.


ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. 2026 మార్చి నాటికి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రూ.250 కోట్ల వ్యయంతో తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణం జరుగుతోంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని నిర్మిస్తున్నారు. నేరస్థుల అన్వేషణ, నేర నిరూపణలో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అవసరం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మించాలని 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2017 డిసెంబర్‌లో తుళ్లూరులో శంకుస్థాపన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. అమరావతి పనులు ఆగిపోయాయి. వాటితో పాటే తుళ్లూరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణం కూడా నిలిచిపోయింది. అయితే 2024లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణం కూడా జోరందుకుంది. మూడు బ్లాక్‌లలో ల్యాబొరేటరీ నిర్మాణం జరుగుతోంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో డీఎన్ఏ, నార్కోటిక్స్, బయోమెట్రిక్స్, సైబర్, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాలు. బాలిస్టిక్స్, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa