ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జరిగిన పౌరసన్మాన సభలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ గొప్పదనాన్ని, తన కుటుంబానికి ఆయన చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు.పౌరసన్మాన సభలో ప్రసంగించే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సింధూర రెడ్డి, బాలకృష్ణ బహుముఖ ప్రజ్ఞను కొనియాడారు. రాజకీయ రంగంలో హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించి, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె అన్నారు. "మీ డెడికేషన్కు హాట్సాఫ్ సార్. మీ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది," అని సింధూర రెడ్డి పేర్కొన్నారు.బాలకృష్ణ సేవా దృక్పథాన్ని వివరిస్తూ, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కుటుంబానికి బాలకృష్ణ చేసిన సహాయాన్ని ఆమె ఉద్వేగంగా పంచుకున్నారు. "2017లో మా అత్తగారికి క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, బసవతారకం ఆసుపత్రిని ఆశ్రయించాం. బాలకృష్ణ గారు స్వయంగా సీఈఓ గారికి చెప్పి, ఇంట్లో చూసుకున్నంత శ్రద్ధగా మా అత్తగారికి చికిత్స అందేలా చూశారు" అని సింధూర రెడ్డి వివరించారు.ఆమె అత్తగారు 2018 ఆగస్టు 30న మరణించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, "అంతకు ముందు రోజే హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ, ఆ బాధలో ఉండి కూడా బాలకృష్ణ గారు ఆసుపత్రికి వచ్చి, మా కుటుంబం బాధలో పాలుపంచుకున్నారు. అంబులెన్స్ ఎక్కించే వరకు మాతోనే ఉండి ధైర్యం చెప్పారు. 'చెల్లెమ్మని ప్రాణాలతో పంపలేకపోతున్నందుకు క్షమించండి' అని ఆయన అన్న మాటలు, ఆరోజు ఆయన చేసిన సహాయం జన్మలో మరువలేము" అని సింధూర రెడ్డి కన్నీటితో తెలిపారు.2015లో తన మామయ్య అనారోగ్యంతో మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు బాలకృష్ణ పరామర్శించడానికి వచ్చిన తీరును కూడా ఆమె ప్రస్తావించారు. "సాధారణంగా నాయకులు గన్మన్లతో వస్తారు. కానీ ఆయన మాత్రం గన్మన్లను, చివరికి చెప్పులను కూడా గేటు బయటే వదిలి లోపలికి వచ్చారు. అంత సంస్కారవంతులు ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే చెల్లింది" అని సింధూర రెడ్డి అన్నారు.బాలకృష్ణ కల్మషం లేని వ్యక్తి అని, తన తండ్రి నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయం, సినిమా, సేవా రంగాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని ఆమె ప్రశంసించారు. లభించిన అవార్డుకే బాలకృష్ణ వన్నె తెచ్చారని పేర్కొంటూ, ఆయన నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన సంస్కారం ఎంతో ఉందని, సత్యసాయి జిల్లాలో ఆయనతో పాటు ఎమ్మెల్యేగా ఉండటం గర్వకారణమని సింధూర రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హిందూపురం మున్సిపల్ విభాగానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa