జగన్ ఐదేళ్ల పాలనలో వేలాది మంది కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారని వెల్లడి .గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వేలాది మంది కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడితే, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడలేదని, రైతాంగ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పాలనలో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు అనుభవించిన క్షోభ వర్ణనాతీతమని అన్నారు. పైగా, గత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు చేసిందని మండిపడ్డారు. కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్నారని విమర్శించారు."జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారు. అప్పుల బాధలు భరించలేక, పంట నష్టాలతో కుంగిపోయి వారు తనువు చాలిస్తుంటే, అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి కూడా వారికి లేకపోయింది" అని మంత్రి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై జగన్కు కనీస అవగాహన లేదని, అందుకే వారి కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు.సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆత్మహత్య చేసుకున్న 20 మంది కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం అందించడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలమైందని మంత్రి గుర్తుచేశారు. "ధరల స్థిరీకరణ నిధి అంటూ గొప్పలు చెప్పారు కానీ, ఐదేళ్లలో దాని నుంచి రూ.50 కోట్లు కూడా రైతుల కోసం ఖర్చు చేయలేని దుస్థితి నెలకొంది. ఇది రైతుల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం" అని ఆయన ఎద్దేవా చేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1,674 కోట్లను తక్షణమే విడుదల చేశామని గుర్తుచేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా తేమ శాతంతో సంబంధం లేకుండా 24 శాతం వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, రైతులకు చెల్లింపులు కూడా వేగవంతం చేశామని వివరించారు.జగన్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఆయన హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాల కన్నీళ్లు ఆయనకు కనబడలేదా అని మంత్రి మనోహర్ ప్రశ్నించారు. కౌలు రైతుల ఆత్మహత్యల పాపం జగన్ ప్రభుత్వానిదేనని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa