ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు కోరుకునేది ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతుంది: రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 06:21 AM

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మెజారిటీ ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారం కోరుకుంటున్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఏది ఆకాంక్షిస్తున్నారో అది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కచ్చితంగా జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. భారత్ వైపు వక్ర దృష్టి సారించే వారికి సైన్యంతో కలిసి గట్టిగా బుద్ధి చెప్పడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "రక్షణ మంత్రిగా, మన సైనికులతో కలిసి పనిచేస్తూ దేశ సరిహద్దులను కాపాడటం నా బాధ్యత. అలాగే, మన దేశం వైపు దుష్ట ఆలోచనలతో చూసే వారికి సాయుధ బలగాలతో కలిసి తగిన జవాబివ్వడం కూడా నా బాధ్యతే" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, ఆయన దృఢ సంకల్పం, నిర్ణయాలు తీసుకునే విధానం ప్రజలందరికీ సుపరిచితమేనని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే చర్యలు ఉంటాయని ఆయన పరోక్షంగా సూచించారు.పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సరిహద్దు ఆవలి నుంచి సంబంధాలున్నాయని భారత్ ఇప్పటికే ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను భారత్ చేపట్టింది. గత కొద్ది రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు, భవిష్యత్తులో భారత్ వైఖరి ఎలా ఉండబోతుందనే దానికి సంకేతంగా నిలుస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa