ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో ఆయనపై నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను కూడా హైకోర్టు నిలిపివేసింది. గత ప్రభుత్వం నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంపై కేసు నమోదు చేసి.. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
2014-2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అయితే ఆ సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఏసీబీ ఆయనపై కేసు నమోదైంది. తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని వెంకటేశ్వరరావు 2022లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను అప్పటి డీజీపీ ప్రారంభించారని.. కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను కూడా డీజీపీనే ఏర్పాటు చేశారని కోర్టులో విచారణ సందర్భంగా వెంకటేశ్వరరావు తరఫు లాయర్ సీనియర్ వాదనలు వినిపించారు.
పిటిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆయా కమిటీల్లో సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే సూచించారని.. కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. భద్రతా పరికరాల కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కోర్టుకు వివరించారు. టెండర్ కార్యకలాపాల సేవలు అందించినందుకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్టీసీఐఎల్)కు ప్రభుత్వం చెల్లించిన రూ.10 లక్షలను కూడా ఆ సంస్థ వెనక్కి ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. టెండర్ కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాను రాబట్టారని.. చివరికి ఆ టెండర్ను అప్పటి డీజీపీ రద్దు చేశారన్నారు.
ఇజ్రాయెల్ సంస్థకు వెంకటేశ్వరరావు కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ అనుబంధంగా పనిచేస్తోందన్న ఏసీబీ ఆరోపణలు సరికాదన్నారు. తెలంగాణ, ఏపీల్లో తమకు ఎలాంటి అనుబంధ సంస్థలు లేవని ఇజ్రాయెల్ కంపెనీ స్పష్టం చేసిందని కోర్టుకు తెలిపారు. కాబట్టి వెంకటేశ్వరరావు కుమారుడి సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణ సరికాదన్నారు. వెంకటేశ్వరరావు చర్యల వల్ల ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి నష్టం జరగలేదని.. కాబట్టి ఆయనపై నేరపూరిత దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ఈ కేసు విషయంలో ఎవరితో కలిసి పిటిషనర్ నేరపూర్వక కుట్ర చేశారో ఏసీబీ వెల్లడించలేకపోయిందని.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ను కొట్టేయాలని కోరారు. అలాగే ఏసీబీ తరఫు లాయర్ కూడా వాదనలు వినిపించగా.. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa