పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. భారత ఎయిర్ఫోర్స్, నేవీ, ఆర్మీ సంయుక్తంగా.. 9 లక్ష్యాలపై 25 నిమిషాల్లోనే దాడి చేసి.. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఇప్పటికే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో వివరించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించారని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శత్రువులకు గట్టి గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత త్రివిధ దళాలు తమ సత్తాను చాటాయని కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా సైనిక బలగాలు చేశాయని తెలిపారు. పాకిస్తాన్ పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం లేకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని.. వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ సిందూర్ దాడులకు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే సుందర్కాండలోని ఒక శ్లోకాన్ని రాజ్నాథ్ వివరించారు. ఈ మెరుపుదాడులను సాహసోపేతమైన దాడులుగా కేంద్రమంత్రి అభివర్ణించారు. ఈ ఆపరేషన్ సిందూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందని.. ఈ విజయం దేశ భద్రతా విధానం బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించిందని తెలిపారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మరోసారి ఉగ్రమూకలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును ఉపయోగించుకుని.. అత్యంత కచ్చితత్వంతో ఈ మెరుపు దాడులు చేపట్టినట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa