ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 03:04 PM

తెలుగు రాష్ట్రాల్లోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.5 లక్షల సొత్తు, లక్షకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనకాపల్లి రూరల్‌ పోలీసులు బుధవారం సాయంత్రం మండలంలోని మారేడుపూడి కూడలిలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడ కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పొంతలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి వారి వద్ద వున్న లగేజీని తనిఖీ చేయగా బంగారం, వెండి వస్తువులు, పట్టుచీరలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. వీరు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఉప్పల సురేశ్‌, విజయవాడ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన కందివలస నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అడుసుమల్లి మండలానికి చెందిన ఉరిడి జనార్దన్‌, గుంటూరు సాంబయ్యకాలనీకి చెందిన కంకణాల సుభాశ్‌లుగా గుర్తించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించి మరింత విచారించారు. ఈ నెల ఒకటో తేదీన అనకాపల్లి మండలం కొండకొప్పాక గ్రామానికి చెందిన రిటైర్డ్‌ షిప్‌యార్డు ఉద్యోగి మరుబాక సత్యనారాయణ ఇంట్లో తులం బంగారం గొలుసు, పావుతులం బంగారం ఉంగరం, రూ.5 వేల నగదు అపహరించుకుపోయారు. అదే రోజు రిటైర్డ్‌ హెచ్‌ఎం పీలా బాల గణపతిరావు ఇంట్లోకి చొరబడి రూ.లక్ష నగదు, యాపిల్‌ ఐ ఫోను, రెండు కిలోల వెండి వస్తువులు ఎత్తుకుపోయారు. పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఒక ఇంటిలో ల్యాప్‌టాప్‌, హోండా సిటీ కారు తాళాలు, పట్టుచీరలతో ఉన్న లగేజీ బ్యాగు అపహరించుకుపోయారు. ఈ చోరీలకు పాల్పడిందిని వీరేనని పోలీసులు నిర్ధారించారు. చోరీ కేసుల్లో పట్టుబడి రిమాండ్‌లో వున్న సమయంలో ఏర్పడిన పరిచయాలతో ఒక ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ర్టాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రెండుంపావు తులాల బంగారం, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.1.05 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, ఐ ఫోన్‌, తొమ్మిది పట్టు చీరలను పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa