శృంగవరపుకోట పరిధిలోని చామలాపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నడుపూరి మురళికి... మృతుడు తొత్తడి ప్రసాద్(38)కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు మురళీకి అతని భార్యతో గొడవల కారణంగా రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. పెద్దలతో వెళ్లి భార్యను ఇంటికి రమ్మని కోరినా రాకపోవడం...పిల్లలను తన వద్దకు పంపించకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. తన భార్య దూరంగా ఉండడానికి ప్రసాద్ కారణమని భావించేవాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్నాడు. ఎప్పటికైనా ప్రసాద్ను చంపుతానని పదేపదే చెప్పేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన ఇంటి పక్కన జరగనున్న పెళ్లికి ప్రసాద్ టెంటు, ఇతర సామాన్లు తెచ్చి సర్దడాన్ని మురళి గమనించాడు. అప్పటికే కత్తితో కాచుకొని ఉన్న మురళి.. ప్రసాద్పై కత్తితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నారాయణమూర్తి తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులకు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనువాసరావు, క్లూస్ టీం పరిశీలించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఇదిలా ఉండగా నిందితుడు మురళి బుధవారం రాత్రి ఎస్.కోట పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa