ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్యానికి మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ,,,, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:23 PM

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శత్రుమూకల దాడులను భారత సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల మధ్య సైన్యానికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైన్యానికి నైతిక మద్దతు అందించేలా షష్ట షణ్ముక క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ మీద భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి. ప్రధాని మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా దేవుణ్ని ప్రార్థించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయన్న పవన్ కళ్యాణ్.. వారి కోసం దేశమంతా ప్రార్థించాల్సిన సమయం ఇదేనన్నారు.


ఇందులో భాగంగా జనసేన పార్టీ తరుఫున మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రతి ఆలయానికి ఒక ఎమ్మెల్యే, జన సైనికులను పంపించి ప్రత్యేక పూజలు చేయిస్తారు.కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయంతో పాటుగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.


ఈ క్రమంలోనే ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్య శక్తి తోడుండేలా జనసేన పార్టీ తరుఫున ప్రత్యేక పూజలు చేయించనున్నారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల్లో సైన్యం కోసం, జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేయనున్నారు. ఆలయాలతో పాటుగా చర్చిలు, మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


మరోవైపు సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని జాతి మరచిపోదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మురళీ నాయక్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్.. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa