ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. .. త్వరలోనే టెండర్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 06:44 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అలాగే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2025-26 బడ్జెట్‌లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం- నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 56 కి.మీ. మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం రూ.2,545 కోట్లు వ్యయమవుతుందని అంచనా. అయితే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కీలక అప్ డేట్ వచ్చింది.


అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయింది, గుంటూరు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎర్రుపాలెం-అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ పూర్తయిందని, రైల్వే అధికారులు టెండర్ డాక్యుమెంటేషన్‌తో సిద్ధంగా ఉన్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. అమరావతి రైల్వే లైన్ మొదటి దశలో రూ. 450 కోట్ల అంచనాతో 27 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, రూ. 350 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే.. ఏపీ రాజధాని అమరావతిని.. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుతో కలుపుతుంది.


అమరావతి రైల్వే లైన్ మొదటి దశ పనులను మూడేళ్లలోగా పూర్తి చేయాలని.. రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లలోపు పూర్తి చేయాలని కోరారు. అయితే రెండేళ్లలోపు ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి మూడేళ్లు పట్టనుంది. అమరావతి రైల్వే లైన్‌కు అదనంగా, రైల్వే మంత్రిత్వ శాఖ అమరావతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రైల్వే జంక్షన్ కోసం 1,500 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రస్తుతం ఎర్రుపాలెం నంబూరు మధ్య సింగిల్ ట్రాక్ నిర్మాణ పనులపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. అయితే తాడికొండ ప్రాంతంలోని కొంతమంది రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. రైల్వే అధికారులు పరిహారం తక్కువగా ఉందని చెప్తున్నారు. మార్కెట్ రేట్లకు అనుగుణంగా పరిహారం మొత్తం చెల్లించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa