భారతదేశంపై పాకిస్తాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం గేరు మార్చింది. ఇక నుంచి భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా.. దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధ చర్యలకు భారత త్రివిధ దళాలు దీటుగా ప్రతిస్పందిస్తాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక నుంచి భారత భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడి.. దానికి కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్తో షాక్కు గురైన పాకిస్తాన్.. సరిహద్దుల వెంబడి విరుచుకుపడుతోంది. ఒకవైపు నియంత్రణ రేఖ వద్ద.. పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. పౌరులు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు అనే తేడా లేకుండా భీకర కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు.. డ్రోన్లు, క్షిపణులతో గగనతలంలో భీకర దాడులకు దిగుతున్నారు. అయితే భూమి, ఆకాశంలో పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టి.. పాక్కే గట్టి బుద్ధి చెబుతోంది.
ఇక సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా.. అది నేరుగా భారత్పై చేసిన యుద్ధంగానే భావిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి వారికి తగిన స్థాయిలో సైనిక చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాలకు భారత్ బలమైన సంకేతం పంపినట్లు అయింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa