ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఒమర్ అబ్దుల్లా

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:57 PM

భారత్, పాకిస్థాన్ మధ్య శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అయితే, ఈ నిర్ణయం రెండు మూడు రోజుల ముందే తీసుకుని ఉంటే అమాయకుల ప్రాణాలు దక్కేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల వల్ల నష్టపోయిన పౌరులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాల్పుల విరమణ నిర్ణయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. "కాల్పుల విరమణను నేను స్వాగతిస్తున్నాను. ఇది రెండు మూడు రోజుల క్రితమే జరిగి ఉంటే, మనవైపున కోల్పోయిన ప్రాణాలు దక్కేవి. పాకిస్థాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణ అమలైంది. నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి, ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ప్రస్తుత జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై ఉంది" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు, ప్రభుత్వ పథకాల కింద నష్టపరిహారం కూడా అందించాల్సి ఉందని అన్నారు."కాల్పుల వల్ల చాలా నష్టం జరిగింది. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. నష్టపోయిన వారికి సహాయం అందించడం ప్రారంభిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసుల వల్ల కలిగిన అంతరాయాన్ని కూడా అబ్దుల్లా ప్రస్తావించారు. "మన విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయబడింది. కాల్పుల విరమణ తర్వాత విమానాశ్రయం తిరిగి తెరుచుకుంటుందని ఆశిస్తున్నాం" అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa