ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే అమలు చేయనుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయంగా రూ.20000 అందించనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ.6000 అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14000 అందించనుంది. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు అందించనున్నారు.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని ఖరీఫ్ సీజన్కు ముందే అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అర్హులైన రైతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులైన రైతులు.. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో మే నెల 20లోగా వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు వివరాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి పైస్థాయి అధికారులకు నివేదించనున్నారు. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత అధికారులు వెబ్ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు.
అక్కడ నుంచి మరోసారి వివరాలను ఆర్జీఎస్కు పంపుతారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ ద్వారా అర్హులను, అనర్హులను గుర్తించి తుది జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. రైతు సేవా కేంద్రం అధికారులు లబ్ధిదారులతో మరోసారి ఈ- కేవైసీ చేయించనున్నారు. అయితే ఈసారి సొంత భూమి కలిగిన వారితో పాటుగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిని అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa