ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మే ఏడో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులలో అర్హులైన వారిని గుర్తించి వారికి కొత్త బియ్యం కార్డులు జారీ చేస్తారు. ఇక ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జూన్లో వీరందరికీ క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మే 15 నుంచి వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సుమారు మూడున్నర లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారందరూ ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేయాల్సిన పనిలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తులలో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. అవి ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ప్రస్తుతం కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులతో పాటుగా కుటుంబ సభ్యుల విభజన, రేషన్ కార్డుల్లోకి కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పుతో పాటుగా.. చనిపోయిన వారి పేర్ల తొలగింపునకు అవకాశం కల్పించారు. అలాగే బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవాలనుకునేవారు కూడా సరెండర్ చేసేందుకు వీలు కల్పించారు. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్కార్డు ఇవ్వనున్నారు. ఆధార్లో నమోదైన అడ్రస్కు కొరియర్ ద్వారా స్మార్ట్కార్డులు పంపే ఆలోచన చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో.. కార్డు నంబరు, కుటుంబ యజమాని పేరు, ఫొటోతో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య, దుకాణం ఐడీ, అడ్రస్, క్యూఆర్ కోడ్ ఉంటాయి. అలాగే స్మార్ట్ కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లతో పాటుగా పుట్టిన తేదీ, వయసు, బంధుత్వం, పర్మనెంట్ అడ్రస్ వంటి వివరాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా కొత్త రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa