నేటి కాలంలో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సర్వీసులు లభించవు.. సిబ్బంది, మందుల కొరత ఉంటుంది. పైగా నాణ్యమైన మందులు లభించవు. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇకపై సర్కార్ ఆస్పత్రుల్లోనే తక్కువ ధరకే నాణ్యమైన మందులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అందుకోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో జన ఔషధి మెడికల్ షాపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే రోగుల ప్రయోజనార్ధం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి అన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం జనరల్ ఆసుపత్రుల్లో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవి లాభాపేక్ష లేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో ఇవి నడుస్తాయని తెలిపారు. జీజీహెచ్లలో ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు కొన్ని సందర్భాల్లో 50 నుండి 600 శాతం మేరకు లాభాలతో ఈ మందుల్ని విక్రయిస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం 16 జీజీహెచ్లలో 23 ప్రైవేట్ జనరిక్ మెడిసిన్ స్టోర్లు ఉన్నాయని అయితే నంద్యాల జీజీహెచ్లో ఇలాంటి స్టోర్ లేదన్నారు సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందుల షాపుల్ని నిర్వహించడానికి లాభాపేక్షలేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు. అలానే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలను నిరోధించడం తప్పనిసరి అని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న 23 జనరిక్ దుకాణాలను స్వయం సహాయక బృందాలు, ఇతర సంఘాలకు కేటాయించారు. అయితే ప్రైవేట్ వ్యక్తులు వాటిని భారీ లాభాలతో నడుపుతున్నట్లు తెలుస్తోందనిసత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.అంతేకాక కండరీ ఆసుపత్రుల్లో కూడా జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించారు. 17 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో జన ఔషధి కేంద్రాల్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదించారు.
అలానే రోగులకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏరియా, జిల్లా ఆసుపత్రులలో కూడా వాటిని నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టబోయే ఈ జన ఔషధి కేంద్రాలకు సంబంధించి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తగు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి బ్రాంచ్లకు కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa