ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్,,,అలిపిరి బ్లాస్ట్ ప్రధాన సూత్రధారి హతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 06:33 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.. ఈ ఘటనలో 28మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట కాగా.. వరంగల్ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్ చదివారు.. ఎంటెక్ చేస్తున్నప్పుడు నక్సలిజానికి ఆకర్షితులయ్యారు. ఈయన చంద్రబాబు నాయుడుపై అలిపిరి బాంబుదాడి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. కేశవరావు 2018లో గణపతి రాజీనామా చేయడంతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేశవరావు తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. కేశవరావు మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో మాస్టర్ మైండ్.. ఐఈడీల వినియోగంలో నిపుణుడు. 1970 నుంచి నంబాల మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి కేశవరావు కారణం అని చెబుతున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు చనిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేశాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్‌జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. అబుజ్‌మడ్‌లోని బటైల్ అడవుల్లో కాల్పులు జరిగాయి. అక్కడ మావోయిస్టు అగ్ర నాయకుల బృందం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు సమాచారం.


కేశవరావుపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. బస్తర్‌లోని నాలుగు జిల్లాల నుంచి భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదంటున్నారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.


2003 అక్టోబరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అలిపిరి దగ్గర మందుపాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది.. అప్పటి పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కొందరు నిర్దోషులుగా బయటకు రాగా.. మరికొందరికి శిక్షపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa