ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Crime |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:52 PM

హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున కుంట్లూరు రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు అధిక వేగంతో ఉండటం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అందులో రెండు వాహనాలు బలంగా ఢీకొనడం స్పష్టంగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుంట్లూరు గ్రామానికే చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు.


మృతులు ముగ్గురూ సోమవారం రాత్రి పెద్ద అంబర్‌పేట్‌లోని ఒక శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి నారపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం కుంట్లూరులోని తమ నివాసాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా అతివేగంతో వచ్చిన కారు, డీసీఎం బలంగా ఢీకొన్న దృశ్యాలు సమీపంలోని పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చనిపోయిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కొక్కరే సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఈ ఘటనతో కుంట్లూరు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.


ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పరిగిలో జరిగిన ఓ వివాహ విందుకు హాజరైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన కొందరు బంధువులు, కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని ఈ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.


మృతులను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన బాలమ్మ, హేమలత, మల్లేష్, సందీప్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌ల ద్వారా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఆగి ఉన్న లారీని నిర్లక్ష్యంగా నిలిపివేయడం, అలాగే బస్సు అతివేగంగా ఉండటమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa