సామాన్యంగానే రైల్వే గేట్ల ఉన్న ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. రైలు వచ్చిన ప్రతీ సారి గేటు వేడయం వల్ల అటూ, ఇటూ రాకపోకలు సాగించే వాళ్లు చాలా సేపు అక్కడే నిలబడాల్సి ఉంటుంది. ఆగలేని వారు గేటు దాటుదామని ప్రయత్నించినా పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతీఒక్కరూ కచ్చితంగా ఎండైనా, వానైనా అక్కడే నిలబడాల్సిందే. ముఖ్యంగా ఏపీలోని గుడివాడ ప్రాంతంలో ఎక్కువగా ఈ రేల్వే గేట్లు ఉండగా.. స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు. అలాంటి సమస్యలకే సర్కారు ఇప్పుడు చెక్ పెట్టబోతుంది. ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రజలకు రైల్వే గేట్ల సమస్యలు తీరిపోనున్నాయి. రైలు రాగానే రైల్వే గేట్లు వేయడం దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, అదే ట్రాఫిక్లో ఎదురుచూడటం లాంటి సమస్యలు ఇక తీరిపోనున్నాయి. గుడివాడ పట్టణంలోని రైల్వే గేట్ల సమస్యను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది.
రైల్వే గతి శక్తి పథకంలో భాగంగా గుడివాడకు రూ.400 కోట్లు కేటాయించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ప్రధాన అవసరాలను దృష్టిలో పెట్టుకుని గుడివాడ నియోజకవర్గంలో 8 రైల్వే బ్రిడ్జిలు, అండర్పాస్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసంం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.400 కోట్లు కేంద్రం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.
గూగుల్ మ్యాప్ల ఆధారంగా భూసేకరణ ప్రాంతాలను పరిశీలించి ఎదురయ్యే సమస్యలపై అధికారులతో చర్చించారు. నిధులు సమకూర్చడంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ వి. దీరజ్ వినీల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రధాన ప్రాజెక్టు..
వై ఆకారంలో బ్రిడ్జి:
బేతవోలు - ధనియాలపేట మధ్య
అండర్పాస్లు:
మందపాడు, కేటీఆర్ కళాశాల రోడ్డులో
పై వంతెనలు:
బొమ్ములూరు, మోటూరు, డోకిపర్రు గేటు వద్ద
పై వంతెన, అండర్పాస్:
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వద్ద
అండర్పాస్:
వడ్లమన్నాడు వద్ద
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa