ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. హోమ్స్టేల అభివృద్ధి వంటి వినూత్న కార్యక్రమాలతో సందర్శకులను ఏపీకి రప్పించేలా ఆలోచనలు చేస్తోంది. పొడవైన తీర ప్రాంతాన్ని, రాష్ట్రంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే మరో వార్త బయటకు వచ్చింది. కృష్ణా నదిలో తేలియాడే రెస్టారెంట్ ( ఫ్లోటింగ్ రెస్టారెంట్) నిర్మించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయాన్ని ఏపీ టూరిజం ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కోపల్లె మంతెన హెరిటేజ్లో జరిగిన కార్యక్రమంలో అజయ్ జైన్ గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి నూతన పాలసీని తీసుకొచ్చామన్న అజయ్ జైన్.. అందులో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.
విజయవాడ వద్ద కృష్ణా నదిలో ఉన్న భవానీ ద్వీపంలో థీమ్ పార్క్, వాటర్ పార్కు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పర్యాటకశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. పర్యాటక రంగాన్ని గ్రోత్ ఇంజన్గా గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఏపీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. అందులో భాగంగానే పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చామని.. అలాగే పలు ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వివరిచారు. ఇండస్ట్రీ స్టేటస్ కింద పర్యాటక రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల కల్పన చేపట్టి పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు.
ఇక అతిథి దేవోభవ కాన్సెప్ట్ కింద హోమ్స్టేల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అజయ్ జైన్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,842 హోంస్టేలు నడుస్తున్నాయని తెలిపారు. సెర్ప్, మెప్మా సిబ్బంది భాగస్వామ్యంతో కొన్ని పైలెట్ టూరిస్ట్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 27 హోటల్స్ నిర్మాణం మొదలెట్టామని.. వీటితో 18 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కృష్ణా నదిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు.
విజయవాడలో బెర్మ్ పార్క్ అభివృద్ధితోపాటుగా.. కోనసీమ బ్యాక్ వాటర్లో హౌస్ బోట్లు ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. భవానీ ద్వీపంలో థీమ్ పార్క్, వాటర్ పార్క్ ఏర్పాటు, పోలవరం, పట్టిసీమ మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు ఏపీ టూరిజం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్లకు బ్లూఫాగ్ గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa