తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకుని గురువారమే వచ్చారు. కాగా.. మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా (26) కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చివద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహమైన తర్వాత చిన్నారి కనపడడం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతోపాటు అందరూ చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు. కాగా, అంతకుముందే అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా.. రహమతుల్లా చిన్నారిని మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లాడు. ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు.అయితే బాలిక కోసం వెదుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా.. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనుక ముళ్లపొదల్లో పడిఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీ్సస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పదోతరగతి వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి కువైట్లో ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa