ఉగ్రవాదం వైపు ఎవరు ప్రోత్సహించారు? ఉన్నత చదువులు చదివి అటువైపు ఎందుకు వెళ్లారు? అని ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లను విచారణ అధికారులు ప్రశ్నించారు. రిమాండ్లో ఉన్న వారిని ఏడు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో తొలిరోజు శుక్రవారం విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ)లో సుదీర్ఘంగా విచారించారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి పకడ్బందీ బందోబస్తు మధ్య ఉదయం 11 గంటల సమయంలో వారిని తీసుకొచ్చారు. ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, సీఐడీ, జిల్లా ఇన్చార్జి ఎస్పీ మాధవ్రెడ్డితో పాటు సుమారు 20 మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటల వరకు వారు పలు ప్రశ్నలు సంధించారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్లను వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేపట్టారు. వీరి సమాధానాలను బేరీజు వేసుకుంటూ విచారణ కొనసాగించనట్లు తెలిసింది. విద్యాభ్యాసం నుంచి ఉగ్రవాదానికి సానుభూతి పరులుగా మారే వరకు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తొలిరోజు సిరాజ్పైనే అధికారులు దృష్టి పెట్టారు. అయితే పలు ప్రశ్నలకు తెలీదు, మర్చిపోయాను, నాకు సంబంధం లేదు అని సిరాజ్ చెప్పినట్లు తెలిసింది. ఆ సమాధానాలకు పలు ఆధారాలను అధికారులు చూపించినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో సిరాజ్ క్రియేట్ చేసిన ‘‘అహీం’’ గ్రూప్లో కార్యకలాపాలపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలిసింది. విచారణ సమయంలో సిరాజ్ ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం. సీన్రీకనస్ట్రక్షన్లో భాగంగా సిరాజ్ నివాసం, అతను తిరిగిన, పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన ప్రాంతాలను విచారణ అధికారులు త్వరలో పరిశీలిస్తారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa