ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి సంబంధం కుదిర్చావేంటని మధ్యవర్తిని హతమార్చిన వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 05:49 PM

కర్ణాటకలోని మంగళూరులో దారుణం చోటుచేసుకుందీ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరుకు చెందిన ముస్తఫా (30) అనే యువకుడికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ముస్తఫా కుటుంబంతో పరిచయం ఉన్న సులేమాన్ (50) దగ్గరుండి సంబంధం కుదిర్చాడు. మధ్యవర్తిగా, పెళ్లి పెద్దగా వ్యవహరించాడు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచి ముస్తఫా, ఆయన భార్య నిత్యం గొడవపడుతూనే ఉన్నారు. పెద్దలు సర్దిచెప్పినా వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఇటీవల ముస్తఫాతో మరోసారి గొడవ జరగడంతో ఆయన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రానని తేల్చిచెప్పింది.దీంతో ముస్తఫా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అదే ఆవేశంతో మధ్యవర్తి సులేమాన్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఇలాంటి సంబంధం కుదిర్చావేంటని దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో సులేమాన్ మెడపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సులేమాన్ కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. తండ్రిని కాపాడుకునేందుకు సులేమాన్ కొడుకులు రియాబ్, సియాబ్‌ అడ్డుపడగా.. వారిపైనా దాడి చేశాడు. ముస్తఫా దాడిలో గాయపడ్డ సులేమాన్ కొడుకులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రియాబ్, సియాబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa