భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోల చిత్రీకరణ పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించగా, గతంలో పూరీ జగన్నాథ ఆలయంతో పాటు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, పూరీ ఆలయంపై డ్రోన్ ఎగరవేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో జ్యోతి మల్హోత్రా పూరీకి చెందిన మరో యూట్యూబర్తో కలిసి శ్రీక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె ఆలయ పరిసరాల్లో డ్రోన్ను ఎగురవేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల దృష్టి ఉందంటూ ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయంపైకి డ్రోన్ను ఎందుకు పంపారు, దాని ద్వారా ఎలాంటి దృశ్యాలను చిత్రీకరించారు అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, గత సంవత్సరం ఏప్రిల్లో జ్యోతి మల్హోత్రా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయితే, అక్కడి విచారణలో ఇప్పటివరకు ఎలాంటి నేరారోపణలు నిర్ధారణ కాలేదని, ఆమె ఏయే ప్రాంతాలకు వెళ్లింది, ఎక్కడ బస చేసింది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa