టాలీవుడ్లో సినిమా థియేటర్ల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయంటూ ప్రచారం మొదలుకావటం.. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించడం.. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి సంచలన ప్రకటన.. ఇలా కథ ఊహించని ట్విస్టులు తిరుగుతూ చివరకు రాజకీయ మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు దిగుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
ఈ వ్యవహారం సంగతికి వస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయంటూ వార్తలు రావటంతో.. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని.. అయినా కూడా ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందంటూ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న వ్యక్తులెవరు, జరుగుతున్నదేమిటి అనే దానిపై విచారణ చేయనున్నట్లు కందుల దుర్గేష్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ పరిణామాలు జరగడం వెనుక కారణాలపై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
థియేటర్ల వ్యవహారం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
ఇదిలా ఉండగానే శనివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా.. తెలుగు ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవలేదన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని , అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచిపోయారా అని ప్రశ్నించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. ఇండస్ట్రీ అభివృద్ధిని కోరుకుంటుందన్న పవన్ కళ్యాణ్.. టికెట్ రేట్లు సహా పలు అంశాలలో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తానంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి వ్యక్తిగతంగా సినీ పెద్దలు తనను కలవొద్దన్న పవన్ కళ్యాణ్.. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు.. వైసీపీ
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనపై వైసీపీ స్పందించింది. పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని ఉద్ధరిస్తానుకుంటే.. థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో తక్కువ రేటుకే ప్రజలు సినిమాలు చూసేందుకు కృషి చేశామన్నారు. పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించిన పేర్ని నాని.. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని,. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చెప్పుచేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని.. ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. సినిమా వాళ్ల సమస్యలు మీకు తెలుసా.. వాళ్లను బెదిరించేందుకు మీరెవరు అంటూ పవన్ కళ్యాణ్పై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సినిమా పెద్దల క్లారిటీ..
మరోవైపు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే.. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తామని సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారంటూ వార్తలు వచ్చాయి. అయితే శనివారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో అలాంటిదేమీ లేదని సినీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa