ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను తగ్గించిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:27 PM

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే విదేశీయులు తమ దేశాలకు పంపే నగదుపై పన్ను తగ్గించింది. గతంలో 5% పన్ను విధించున్నట్టు ప్రకటించినప్పటికీ దానిని 3.5%కి పరిమితం చేశారు తాజాగా నిర్ణయం అమెరికాలో పనిచేసే భారతీయులకు ఊరటనిస్తుంది. అమెరికా నుంచి వేరే దేశాలకు డబ్బు పంపేటప్పుడు ‘ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్‌ఫర్స్’ పేరుతో పన్ను వసూలు చేసేలా బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. బ్యూటిఫుల్ బిల్లుగా అభివర్ణించిన రిపబ్లికన్‌లు.. 5 శాతం పన్ను వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే, విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు దానిని 3.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు అమెరికా నుంచి లక్ష పంపితే రూ.3,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


డబ్బును బదిలీ చేసే బ్యాంకులు, మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలు ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి ఇస్తాయి. ఈ పన్నుల చట్టం బిల్లును 'వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్' పేరుతో రూపొందించారు. అమెరికా ప్రతినిధుల సభ దీనికి ఆమోదం తెలిపింది. అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. అంటే అతి తక్కువ మెజారిటీతో ఈ బిల్లు గట్టెక్కింది. అమెరికాలో దాదాపు 44.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారిలో చాలామంది భారత్‌‌లోని తమ కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, బంధువులకు పంపుతుంటారు. ఈ పన్ను తగ్గడం వల్ల వారికి కొంత మేలు జరుగుతుంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.


ఇక, గతేడాది అమెరికా ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ విదేశీయులు, వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కఠిన ఆంక్షలతో వలసదారులను ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత సంక్లిష్టంగా మారాయి. అక్రమ వలసదారులను గుర్తించి.. వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. విద్యార్థులను కూడా ట్రంప్ ప్రభుత్వం వదలిపెట్టడం లేదు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల వీసాలను రద్దుచేసి..అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. దీంతో చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.


అమెరికా కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసింది. స్టాండర్డ్ డిడక్షన్, పిల్లల పన్ను క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచారు. ఇంతకుముందు అమెరికాలో ఉంటున్న వాళ్లు తమ దేశాలకు డబ్బు పంపితే ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు పన్ను విధిస్తోంది. దీని ద్వారా అమెరికా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తాన్ని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు ఉపయోగించాలని ట్రంప్ భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa