ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. జూన్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 వేలు అందించనుండగా.. మిగతా రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు రైతుల తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఎంపిక గడువును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగు భూములను రీసర్వే చేశారు. రీసర్వేలో భాగంగా ఏళ్ల తరబడిగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్పీఎం) తీసుకువచ్చారు. గతంలో సర్వే నంబరు ఒక వ్యక్తికి ఒకటే ఉండేది. అదే సర్వే నంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగేది. కానీ రీసర్వే సమయంలో నలుగురు, ఐదుగురు రైతులకు కలిపి ఒకే ల్యాండ్ పార్శిల్ మ్యాప్ కేటాయించారు. ఆ మేరకు హక్కు పత్రాలు కూడా అందించారు.
అయితే ల్యాండ్ పార్శిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే... మిగిలిన రైతుల భూమి విస్తీర్ణం కూడా ఆయన పేరుమీదే నమోదైంది. ఇలాంటి ఉమ్మడి ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్లు ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. ల్యాండ్ పార్శిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డుల్లో ఉండటంతో మిగతా వారికి అన్నదాత సుఖీభవ పథకం అందేలా కనిపించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రీసర్వే చేసిన కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. అలాగే ఆధార్ నంబర్లు సరిగా లేకపోవటం, మొబైల్ నంబర్, ఆధార్ లింకింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతులు రైతు సేవా కేంద్రాలలో సంబంధిత పత్రాలతో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారీగా.. వెబ్ల్యాండ్లో సర్వే నంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం వంటి వివరాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ సమాచారం మండల వ్యవసాయాధికారికి, ఆ తర్వాత జిల్లా వ్యవసాయాధికారికి చేరుతుంది. ఏమైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా.. జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa