చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025కి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. గుజరాత్ టాప్ 2 ఆశలపై నీళ్లు చల్లి ఈ సీజన్ లాస్ట్ మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ను వాళ్ల హోం గ్రౌండ్లోనే చిత్తుచిత్తు చేసింది.
ఐపీఎల్ 2025కి సీఎస్కే విజయంతో వీడ్కోలు పలికింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. రికార్డు స్థాయిలో 230 పరుగులు చేసిన సీఎస్కే.. బౌలింగ్లోనూ గుజరాత్ను ముప్పుతిప్పలు పెట్టింది. పవర్ ప్లేలోనే గుజరాత్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని పెవిలియన్కు పంపి మ్యాచ్ని డిసైడ్ చేసింది.
కెప్టెన్ శుభమన్ గిల్, జాస్ బట్లర్, రూథర్ఫోర్డ్ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టారు. గిల్ 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 13 పరుగులు చేయగా, బట్లర్ 7 బంతుల్లో 5, రూథర్ఫోర్డ్ 4 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. దాంతో 30 పరుగులకే గుజరాత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్ - షారూఖ్ ఖాన్ కొంతసేపు మ్యాచ్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు.
అయితే సాయి సుదర్శన్, షారూఖ్ ఖాన్ని సీఎస్కే స్పిన్నర్ రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి ఖరారైంది. సాయి సుదర్శన్ 28 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా, షారూఖ్ ఖాన్ 15 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటయ్యారు. రషీద్ ఖాన్ 12, రాహుల్ తెవాటియా 14 పరుగులు చేసి పెవిలియన్కు వెళ్లారు. గెరాల్డ్ కోయెట్జీ 5, అర్షద్ ఖాన్ 20, రవి కిశోర్ 3 పరుగులు చేయగా.. సిరాజ్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
సీఎస్కే అందించిన 231 పరుగుల టార్గెట్ ముందు బోల్తా పడిన గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే అత్యధిక స్కోర్ చేసిన మ్యాచ్తో పాటు అత్యధిక మార్జిన్తో గెలిచిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం.
ఈ సీజన్ను విజయంతో ఆరంభించిన సీఎస్కే విజయంతోనే ముగించింది. ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన సీఎస్కే కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. మార్చిలో ఒకటి, ఏప్రిల్లో మరొకటి, మేలో రెండు మ్యాచ్లు గెలిచింది. పదో స్థానంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్కు గుడ్ బై పలికింది. ఈ సీజన్లో సీఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఎంఎస్ ధోనీ కెప్టెన్లుగా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa