ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాంటి వడ్డీ లేకుండా.,,,డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వరకూ రుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:11 PM

రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా చేయూత అందించి.. మహిళా సాధికారత సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పలు పథకాలను తీసుకువచ్చింది. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం తీసుకువచ్చింది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు అందిస్తారు. ఈ రుణాల సాయంతో ఎస్సీ, ఎస్టీ మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనేది ఉన్నతి పథకం లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతి పథకం ప్రారంభమైంది. ఆ తర్వాత 2014 లో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించింది.


అయితే అప్పట్లో ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి రూ. 20 వేల నుంచి రూ.50 వేలు వరకూ సున్నా వడ్డీకి రుణాలు అందించారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకూ పెంచింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.30 వేలు నుంచి రూ.5 లక్షల వరకూ వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. అయితే ఈ రుణం తీసుకున్న మహిళలు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. అలా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకు కేటాయిస్తారు. ఉన్నతి పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 8.53 కోట్ల మేర రుణాలు ఎస్సీ, ఎస్టీ మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.


ఉన్నతి పథకం.. అర్హులు ఎవరంటే


ఉన్నతి పథకానికి డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు అర్హులు. ఈ పథకం కింద కనిష్టంగా రూ. 30 వేల నుంచి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తులను గ్రామ సంఘాలకు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హతలు, జీవనోపాధికి ఎంపిక చేసుకున్న యూనిట్‌ను పరిశీలించి బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేస్తారు. అనంతరం మహిళలు తాము తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణంపై ఎలాంటి వడ్డీ లేకపోగా.. రుణ గ్రహీతలకు బీమా సదుపాయం కూడా ఉంటుంది.


ఉన్నతి పథకం కింద రుణం తీసుకున్న వారు తప్పనిసరిగా యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే కారణంతోనైనా లబ్ధిదారు చనిపోతే ఉన్నతి కింద తీసుకున్న రుణం రద్దవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa