ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీజ, మదర్ డెయిరీ యూనిట్లు.. ఏపీలోనే, ఫిక్స్.. 8 వేలమందికి ఉపాధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:17 PM

సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. కుప్పం నియోజకవర్గంలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా శ్రీజ, మదర్ డెయిరీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో యూనిట్లు నెలకొల్పడంపై ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డెయిర్ పెట్టుబడులు పెట్టనున్నట్లు చంద్రబాబు వివరించారు.


కుప్పంలో శ్రీజ, మదర్ డెయిర్ పెట్టుబడుల కారణంగా స్థానికులకు 8000 ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు వివరించారు. అలాగే పాల సేకరణ, హార్టీకల్చర్ ద్వారా గ్రామీణ రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. రెండు కంపెనీలకు యూనిట్లు నెలకొల్పేందుకు కుప్పంలో భూమిని కేటాయించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు కుప్పంలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్.. డెయిరీ, అనిమల్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనుంది. అలాగే మదర్ డెయిరీ.. ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. కుప్పం సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ యూనిట్ల ఏర్పాటు కోసం శ్రీజ, మదర్ డెయిరీ కంపెనీలు కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ తో ఒప్పందం చేసుకున్నాయి.


మరోవైపు వచ్చే 15 నుంచి 18 నెలల్లో యూనిట్లు నెలకొల్పి.. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనాలు అందించాలని శ్రీజ, మదర్ డెయిరీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. స్వర్ణాంధ్ర దార్శనికతకు అనుగుణంగా, పేదరిక నిర్మూలన కోసం చేపట్టాల్సిన పెట్టుబడి ప్రణాళికలపై కంపెనీల ప్రతినిధులతో చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. కుప్పం ప్రాంత రైతుల ఆదాయం పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఈ పెట్టుబడుల ఉద్దేశమని చంద్రబాబు వివరించారు.


మరోవైపు కుప్పంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు కుటుంబం ఆదివారం గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం కుప్పం వెళ్లిన చంద్రబాబు.. సోమవారం మధ్యాహ్యానికి తిరిగి విజయవాడ చేరుకున్నారు. సచివాలయంలో వివిధ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa