థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను తొలగించింది. థియేటర్ బంద్ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది.జూన్ 1న సినిమా థియేటర్ల బంద్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ నేపథ్యంలో కుట్ర పూరితంగానే ఈ వ్యవహారం నడుస్తోందని ఇప్పటికే నిర్ధారించారు. ఇందులో తమ పాత్ర లేదని నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ చెప్పినప్పటికీ ప్రభుత్వపరంగా పార్టీపరంగా జరిపిన విచారణలో కొంతమంది నేతల పేర్లు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి నేత అత్తి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. థియేటర్ల బంద్కు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టగా.. ఈ వ్యవహారంలో సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రారంభమైందని, అక్కడి నుంచే తెలంగాణకు ఆపాదించారంటూ దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో వెంటనే అప్రమత్తమైన జనసేన అధిష్టానం దీనిపై విచారణ జరిపి సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు తేల్చారు.ఈ నేపథ్యంలో సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ జనసేన అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన నేత వేముల అజయ్ కుమార్ పేరుతో సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa