సినిమా థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన పార్టీ కీలక నేత ఉన్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణను జనసేన పార్టీ ఇంఛార్జి పదవి నుంచి తప్పించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వాములంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అత్తి సత్యనారాయణ జనసేన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా రాజమండ్రి నగర నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జనసేన పార్టీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అత్తి సత్యనారాయణపై వచ్చిన ఆరోపణలు నిజమా, అబద్ధమా అని నిరూపించుకునేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
మరోవైపు సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలోనూ సినిమా థియేటర్ల బంద్ వివాదం గురించి ప్రస్తావించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో తాజా పరిణామాలపై చర్చించానన్న పవన్ కళ్యాణ్.. ఆ వివరాలను తెలియజేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం గురించి, ఆ నలుగురు ప్రమేయం , ఆ తర్వాత తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడంపైనా పవన్ కళ్యాణ్ చర్చించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత థియేటర్ల బంద్ ప్రకటన వెలువడటం.. తదితర అంశాలు కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినట్లు డిప్యూటీ సీఎంవో కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలోనే థియేటర్ల బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్కు వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు ఉన్న ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని సినీ వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కి పవన్ కళ్యాణ్ సూచించారు.
సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనక ఉన్న కారణాలు తెలుసుకోవాలని.. ఇందుకు కారకుల్లో జనసేన వాళ్లు ఉన్నా కూడా చర్యలకు వెనుకాడవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేటు వేశారు. ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa