దేశంలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రికి దేశవ్యాప్తంగా 1,010 క్రియాశీల కొవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ కొత్త వేరియంట్లయిన ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7లను దేశంలో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇదివరకే ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గతంలో కరోనా సోకడం వల్ల లేదా టీకాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గడం కేసుల పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మళ్లీ వైరస్ బారినపడే అవకాశాలున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అయితే, జేఎన్.1 ఉపరకమైన ఎన్బీ.1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది.వాతావరణ పరిస్థితులు కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చల్లని, అధిక తేమతో కూడిన వాతావరణంలో కరోనా వైరస్, ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలోని అనేక నగరాల్లో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వాతావరణం కరోనా వ్యాప్తికి అనుకూలంగా మారిందని అంచనా వేస్తున్నారు.దీనికి తోడు, పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో గాలిలో తేమ శాతం పెరగడం కూడా వైరస్ పునరుజ్జీవనానికి ఒక కారణం కావొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, జన్యుపరమైన నిఘా తగ్గడం కూడా కేసుల పెరుగుదలకు దారితీస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కొవిడ్-19ను ఎండమిక్గా గుర్తించిన తర్వాత, సాధారణ పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణలు, పర్యవేక్షణ తగ్గడం కూడా వైరస్ మళ్లీ వ్యాపించడానికి కారణంగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.సింగపూర్, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మే నెల తొలివారంలో సింగపూర్లో దాదాపు 30 శాతం మేర ఇన్ఫెక్షన్లు పెరిగాయి. అయితే, మన దేశంలో మాత్రం కొవిడ్ వ్యాప్తి కొన్ని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం నమోదైన క్రియాశీల కేసుల్లో కేరళలోనే సుమారు 43 శాతం ఉండగా, మహారాష్ట్ర 21 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ (10 శాతం), గుజరాత్ (8 శాతం), తమిళనాడు (7 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa