ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీకి కర్ణాటక భక్తురాలి భారీ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 06:56 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.54 లక్షలు విరాళంగా అందింది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన విద్యా రవిచంద్రన్ అనే భక్తురాలు.. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు 54 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా దాతను వెంకయ్య చౌదరి అభినందించారు.


మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఎనో సేవా కార్యక్రమాలను చేపడుతోంది. అందులో ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ఒకటి. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా గుండె, మూత్రపిండాలు, మెదడు, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. శ్రీవారి భక్తులు అందించే విరాళాల ద్వారా ఎస్వీ ప్రాణదాన ట్రస్టును నిర్వహిస్తున్నారు.


ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి ఉచిత వైద్యం, చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వైద్య సదుపాయాలను అందిస్తారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళాలు అందించడం ద్వారా పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడానికి సహాయపడవచ్చు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే ప్రముఖులు, భక్తులు.. ఈ ట్రస్టుకు విరాళాలు అందిస్తూ.. మానవసేవే మాధవసేవగా భావిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక భక్తురాలు విద్యా రవిచంద్రన్ టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు.


అప్పలాయగుంట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు


మరోవైపు అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆల‌యంలో జూన్ 6వ తేదీ నుంచి జూన్ 15 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. జూన్ ఆరో తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు.


శ్రీవారు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వకుళామాత ఆశ్రమానికి వెళ్లే మార్గమధ్యంలో సిద్దేశ్వరస్వామి తపస్సును మెచ్చి ఇక్కడ ఆగారు. సిద్ధేశ్వరస్వామి కోరిక మేరకు అభయ హస్తాలతో వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిసినట్లు స్థల పురాణం. ఇక్కడ ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa