జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అవినాబావ సంబంధాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా, పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సుల అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్... అమెరికా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి. లష్కరే తొయీబా ఉపాధ్యక్షుడు సైఫుల్లాహ్ కాసౌరి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ర్యాలీలో అతడితో పాటు లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పాల్గొనడం గమనార్హం.
పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫుల్లాహ్ కాసౌరిని అనుమానితుడిగా చూడకూడదని, విచారణ పూర్తికాని వరకు అతడు అనుమానించకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను కూడా కాసౌరి ప్రాంతానికి చెందినవాడ్నే అని చెప్పారు.
1971 ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాం
1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో తాము విజయం సాధించామని పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో కాసౌరీ, తల్హా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం మే 28న ఈ ర్యాలీని గుజ్రన్వాలాలో లష్కరే తొయిబా రాజకీయ విభాగం నిర్వహించింది. సైఫుల్లాహ్ కాసౌరి భారీ భద్రత మధ్య వేదికపైకి వచ్చిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్పై గెలిచామని కీర్తిస్తూ.. అతడిపై అక్కడివారు పూల వర్షం కురిపించారు. ఇదే వేదికపై పంజాబ్ స్పీకర్ ఆయన పక్కనే కూర్చోవడం గమనార్హం.
హసినా వ్యతిరేక నిరసనలు
అలాగే, ర్యాలీలో లష్కరే నేతలు మాట్లాడుతూ.. గతేడాది బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసినాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో తమ పాత్రను ఘనంగా చెప్పుకున్నారు. హసీనా నుంచి దేశం నుంచి పారిపోయేలా చేసి.. భారత్లో ఆశ్రయం పొందేలా చేయడంలో తామము విజయం సాధించామని పేర్కొన్నారు. ఇక, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సైనా ఉల్లాహ్ కాసౌరి ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. 1971లో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్థాన్కు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నామని వ్యాఖ్యానించాడు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తాజా ఘటన.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు మరోసారి తేటతెల్లం చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్లకు చెందిన 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ సైతం భారత్పై దాడులకు ప్రయత్నించింది. అయితే, భారత సైన్యం ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి.. ప్రతిదాడులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa