ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలపై సీఎం చంద్రబాబు, మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే శ్రీకాకుళంలో రక్షిత మంచినీటి సరఫరాపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం రక్షిత నీటి సరఫరాకు రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గానికి రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం లభించింది.
అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, అలాగే ఆయా కంపెనీలు ప్రభుత్వం అందించే రాయితీల కల్పనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఖైదీల క్షమాభిక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్తత్ర్పవర్తన కలిగిన ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. వీటితో పాటుగా 248 మంది కానిస్టేబుళ్ల ప్రమోషన్పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పోలీస్ అకాడమీ కోసం అదనంగా 94.45 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది.
అలాగే రాష్ట్రంలోని మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేలా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రి వేళ పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు వైఎస్సార్ జిల్లా పేరును ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ జిల్లా పేరు మార్పుపై విడుదల చేసిన జీవోను కేబినెట్ ఆమోదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa