ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము ఎక్కడికి పారిపోలేదు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 04:09 PM

లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి పరారీలో ఉందంటూ కోల్‌కతా పోలీసులు చేసిన ఆరోపణలను ఆమె తండ్రి పృథ్వీరాజ్ పనోలి తీవ్రంగా ఖండించారు. తాము పరారీలో లేమని, పోలీసుల ప్రధాన కార్యాలయం లాల్‌బజార్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకు ఆధారంగా విజిటర్ స్లిప్పులను మీడియాకు చూపించారు. శర్మిష్ఠను గురుగ్రామ్‌లో అరెస్టు చేసిన అనంతరం కోల్‌కతా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియను అనుసరించామని, నిందితురాలికి పలుమార్లు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని, కానీ ఆమె ప్రతిసారీ పరారీలో ఉన్నట్టు తేలిందని తెలిపారు. నిందితురాలు తన కుటుంబంతో సహా పరారీలో ఉండటంతో నోటీసులు అందించడం సాధ్యం కాలేదని, తదనంతరం కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొంది, చట్టప్రకారం గురుగ్రామ్‌లో పగటిపూట ఆమెను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.అయితే, పోలీసుల వాదన పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారంతో కూడుకున్నదని శర్మిష్ఠ తండ్రి పృథ్వీరాజ్ ఆరోపించారు. పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ, మే 15న కోల్‌కతా పోలీసు హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ జారీచేసిన రెండు ‘విజిటర్ స్లిప్పులను’ ఆయన ప్రదర్శించారు. ఆ స్లిప్పులలో తన కుమార్తె శర్మిష్ఠ పేరు, తన పేరుతో పాటు ఫోటోలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. గార్డెన్‌రీచ్ పోలీస్ స్టేషన్‌లో శర్మిష్ఠపై మే 15న ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, మే 17న అరెస్ట్ వారెంట్ జారీ కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa