బెంగళూరులో బుధవారం ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని తాము ఊహించలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు.విలేకరులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, "ఈ దుర్ఘటన మా విజయోత్సాహాన్ని నీరుగార్చింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు. మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామని ఆయన వివరించారు."ప్రజల స్పందన మా అంచనాలను మించిపోయింది. విధానసౌధ ముందు లక్షకు పైగా జనం గుమిగూడినా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ విషాదం సంభవించింది. క్రికెట్ అసోసియేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఇంతటి పరిణామం ఊహించలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 కాగా, రెండు నుంచి మూడు లక్షల మంది ప్రజలు తరలివచ్చారని అంచనా. స్టేడియం సామర్థ్యానికి అనుగుణంగానే ప్రజలు వస్తారని భావించాం" అని సిద్ధరామయ్య తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa