డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనిని నియంత్రించకపోతే, అది గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలను దెబ్బతీస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. మధుమేహాన్ని నియంత్రించడానికి మెడిసిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. టైప్ -1, టైప్ -2 డయాబెటిస్తో బాధపడేవారు కచ్చితంగా మెడిసిన్ తీసుకోవాలి. టైప్ 1 డయాబెటిస్లో శరీరం ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేదా పంపుల ద్వారా ఇన్సులిన్ను బయట నుండి అందించాలి. మాత్రల ద్వారా ఇన్సులిన్ తీసుకోలేరు.
ఇక, టైప్ -2 డయాబెటిస్లో శరీరం ఇన్సులిన్ను సరిగా ఉపయోగించుకోదు. అంటే శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు. దీనికి జీవనశైలి మార్పులు, నోటి మందులు (మెడిసిన్), కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. అయితే, కొన్ని డయాబెటిస్ మెడిసిన్ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపులో మంట, విరేచనాలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. దీంతో, కొందరు మందులు తీసుకోవడం మానేస్తారు. అయితే, వైద్యుల సలహా లేకుండా మెడిసిన్ ఆపేయడం చాలా ప్రమాదం. దీని వల్ల కొన్ని ప్రమాదాలు ఎదురువుతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
హైపర్గ్లైసీమియా
డయాబెటిస్తో బాధపడుతూ సడన్గా మందులు తీసుకోవడం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఈ పరిస్థితి హైపర్గ్లైసీమియా అంటారు. మందులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సాయపడాయి. అవి ఆపేస్తే, రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి. దీనివల్ల తీవ్రమైన అలసట, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
టైప్ 1 డయాబెటిస్తో బాధపడేవారు ఇన్సులిన్ తీసుకోవాలి. వీళ్లు ఇన్సులిన్ తీసుకోవడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం ఇన్సులిన్ లేకుండా శక్తి కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం వల్ల కీటోన్లు పేరుకుపోతాయి. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. దీని లక్షణాలు వికారం, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కోమా లేదా మరణం కూడా సంభవించవచ్చు.
హైపర్స్మోలార్ హైపర్గ్లైసీమిక్ స్టేట్ (టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవారికి)
టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవారు మందులు తీసుకోవాలి. వీరు మెడిసిన్ తీసుకోవడం మానేస్తే హైపర్స్మోలార్ హైపర్గ్లైసీమిక్ స్టేట్ అనుభవించవచ్చు. ఇది కూడా ప్రాణాంతకమైన పరిస్థితి. ఇందులో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి, తీవ్రమైన నిర్జలీకరణం (dehydration) సంభవిస్తుంది.
ఈ సమస్యలు కూడా వస్తాయి
* డయాబెటిస్ రోగులు మందులు తీసుకోవడం మానేస్తే దీర్ఘకాలిక సమస్యల ప్రమాదం పెరుగుతుంది
* రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
* మూత్రపిండాలు దెబ్బతిని, చివరికి కిడ్నీ వైఫల్యం కూడా సంభవించవచ్చు. దీనికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు.
*నరాలు దెబ్బతిని కాళ్లు, చేతుల్లో నొప్పి, తిమ్మిరి, స్పర్శ కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు.
* కంటిలోని రక్తనాళాలు దెబ్బతిని దృష్టి తగ్గిపోవడం, చివరికి అంధత్వం కూడా సంభవించవచ్చు. డయాబెటిక్ రెటినోపతిలో ఈ పరిస్థితి తలెత్తవచ్చు.
* రక్త ప్రసరణ తగ్గి పాదాలకు ఇన్ఫెక్షన్లు, పుండ్లు ఏర్పడవచ్చు. అవి మానక పోతే, కొన్ని సందర్భాల్లో కాలు తొలగించాల్సి రావచ్చు.
* చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఆందోళన, చిరాకు వంటి మానసిక సమస్యలకు దారితీస్తాయి.
ముఖ్యమైన విషయాలు
ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపడం మంచిది కాదు. మీరు మధుమేహం మందులు ఆపాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా మీ డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. డాక్టర్ మీ పరిస్థితిని అంచనా వేసి, తగిన సలహా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో, జీవనశైలి మార్పులు ద్వారా టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలోకి వచ్చి, మందుల అవసరం తగ్గొచ్చు లేదా పూర్తిగా ఆపగలిగే అవకాశం కూడా ఉండవచ్చు. కానీ, ఇది ఎప్పుడూ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. సొంత నిర్ణయాలు ప్రాణాంతకం కావచ్చని గుర్తించుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa