ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి వీడియో,,,,స్పందించిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 06:39 PM

తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి అంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమని తెలిపింది టీటీడీ. రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా చెబుతూ ప్రచారం చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది అన్నారు. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోందని.. సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో జరిగిందన్నారు. ఆ ప్రాంతం తిరుమల ప‌రిధిలోకి రాదని.. అయినా కొంద‌రు వ్యక్తులు ప్రచార యావ‌తో తిరుమ‌ల‌లో అప‌చారం జ‌రిగిందంటూ ప్రచారం చేయ‌డం మ‌హాపాపం అన్నారు.


భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నామని.. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. తిరుమలలో ఓ వ్యక్తి మద్యం సేవించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మద్యం సేవించి.. ఆ ఖాళీ మందు బాటిళ్లను మెట్లపైకి విసిరేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ క్రమంలో ఈ వీడియో బాగా వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది.. ఈ వీడియోకు తిరుమలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


నిరంతరంగా ఉపనిషత్తుల సందేశం


మరోవైపు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 'తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో జాతీయ గీతా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో జూన్ 11న తిరుపతి, అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 07 గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు నిరంతరంగా ఉపనిషత్తుల సందేశంపై వ్యాఖ్యానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పౌరాణిక శిరోమణి మరియు ధర్మ ప్రచార పరిషత్ ప్రొగ్రాం అసిస్టెంట్ శ్రీ పొన్నా కృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో తైత్తిరీయోపనిషత్, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు అంశాలపై నిర్విర్వామంగా వ్యాఖ్యానించనున్నారు' అని తెలిపారు.


గోవిందుడి రథోత్సవం


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే.


అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, న‌మ్మాళ్వార్ల‌ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10న మంగళ వారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం నందు) స్నపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరుగనుంది. సా. 4.30 గంటలకు స్వామి, అమ్మ‌వార్లు బంగారు తిరుచ్చిపై, చ‌క్ర‌తాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్‌.తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 07.00 గం.లకు శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగనుంది. అనంతరం రాత్రి 8.40 – 9.30 గం.ల మధ్య ధ్వజారోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa