ఉత్తర ప్రదేశ్ బృందావనంలోని రాఛూర్ శ్రీరాధారామన్ ఆలయంలో పలువురు మహిళా దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 10 మంది ఓ ముఠాగా ఏర్పడి మరీ.. గుడిలోనే దొంగతనాలు చేస్తున్నారు. దైవ దర్శనం కోసం వచ్చిన మహిళా భక్తులనే లక్ష్యంగా చేసుకుని.. వారి మెడలోంచి నగలను, చేతుల్లోంచి పర్సలను కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయంలో ఇలాంటి ఘటనలు చాలానే జరగ్గా.. తాజాగా ఓ మహిళా న్యాయమూర్తి మెడలోంచే మంగళ సూత్రాన్ని కొట్టేశారు. ముఖ్యంగా జూన్ 1వ తేదీన మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా పని చేస్తున్న ప్రేమా సాహు తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు గుడికి వెళ్లారు.
ఈక్రమంలోనే ఆలయంలోకి వెళ్లి దేవుడిపైనే మనుసును లగ్నం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే ఈసయంలోనే ఆమె తాళిబొట్టును ఎవరో కొట్టేశారు. అక్కడున్నప్పుడు ఆమె ఈ విషయాన్ని గుర్తించకపోయినప్పటికీ.. బయటకు వచ్చాకే తన మెడలోని తాళిబొట్టు లేదనే విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్జి మెడలోంచే మంగళ సూత్రం కొట్టేయడంతో.. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం జల్లెడ పట్టారు. ముఖ్యంగా ప్రత్యక్షసాక్షుల ఆధారంగా విచారణ జరిపారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని క్షణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడే ఎక్కువగా తిరుగుతున్న 10 మంది మహిళలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈక్రమంలోనే వారి వద్ద నుంచి అనేక పర్సులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మహిళా న్యాయమూర్తి మంగళ సూత్రం సహా రూ.18,652 నగదు పట్టుబడింది. అలాగే అనేక ఆధార్, పాన్, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా దొరికాయి. దీంతో వారే దొంగలుగా గుర్తించిన పోలీసులు ఆపై తదమైన స్టైల్లో విచారించగా.. వారు కూడా తమ తప్పును ఒప్పుకున్నారు. గుడిలోనే అనేక మార్లు దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. అలాగే వీరంతా మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఎక్కువగా జనాలు ఉన్న గుడులే లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుసుకుని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa