వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సజ్జల రామకృష్ణారెడ్డికి త్వరలోనే నోటీసులు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ మంగళవారం స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించనున్నట్టు తెలిపారు.మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఛైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసిన రాజధాని ప్రాంత మహిళలు, సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు. వైసీపీ నాయకులకు అమరావతి మహిళలంటే చులకన భావం ఏర్పడిందని వారు వాపోయారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమ కేసులు బనాయించి తమను తీవ్రంగా వేధించారని, ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ నాయకులు తమను మానసికంగా మరింత క్షోభకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.రాష్ట్రంలో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడానికి రాజధాని మహిళలే కారణమంటూ తమను కించపరిచేలా సజ్జల వ్యాఖ్యానించడం తగదని వారు హితవు పలికారు. ఇటువంటి వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజధాని మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఛైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ కు కూడా వివరిస్తామని తెలిపారు. మహిళల నుంచి అధికారికంగా ఫిర్యాదు అందకముందే, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిందని, ఈ మేరకు ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్కు ఒక లేఖ కూడా రాసినట్లు ఆమె పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం తగదని శైలజ అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa