ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జవాన్ మురళీనాయక్‌కు ఏపీ సర్కార్ అండ,,,,రూ.50 లక్షలు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల పట్టా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 06:58 PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశరక్షణ కోసం వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్‌కు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీ కుటుంబానికి ప్రకటించిన సాయాన్ని అందజేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి సవిత.. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి.. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు 5 ఎకరాల పొలం, 6 సెంట్ల ఇంటి పట్టా, రూ.50 లక్షల అందజేశారు. భవిష్యత్‌లోనూ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సవిత. అలాగే కల్లితండాకు మురళీ నాయక్ పేరు పెట్టాలని స్థానికులు కోరారని.. ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రెవెన్యూ రికార్డుల్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.. అలాగే మురళీ నాయక్ విగ్రహాన్ని శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఇప్పటికే విగ్రహం తెనాలిలో తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఏపీ ప్రభుత్వం మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ సాయానికి సంబంధించిన చెక్‌ను జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), నిమ్మల జయకృష్ణ(పాలకొండ), మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన నేతలతో కలిసి మురళీ తల్లిదండ్రులకు అందజేశారు. ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నేతలు మురళీనాయక్ తల్లిదండ్రుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి.. వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు రూ.25 లక్షల రూపాయల చెక్కును శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ మురళీనాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. అంతేకాదు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన ఒక నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు.


శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ మే 9న జమ్మూకాశ్మీర్‌లో వీరమరణం పొందారు. మురళీనాయక్ 2022లో అగ్నివీర్‌ జవాన్‌గా సైన్యంలో చేరారు.. అయితే ఆయన నాసిక్‌లో విధుల్లో ఉండగా.. మే నెలలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలతో మురళీనాయక్‌కు జమ్మూకాశ్మీర్ సరిహద్దుకు పిలిపించారు. ఈ క్రమంలో పాక్‌వైపు నుంచి చొరబాటు దారుల కాల్పులు జరపగా మురళీనాయక్‌ ప్రాణాలు కోల్పోయారు. వీర జవాన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటూ పలువరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa