ఇరాన్ ప్రభుత్వం తమ పౌరులను స్మార్ట్ఫోన్ల నుండి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను తొలగించాలని ఆదేశించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ అనూహ్య నిర్ణయం వెనుక భద్రతా, ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెబుతోంది. ముఖ్యంగా ఇరాన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అధిపతి కమాల్ హేడారి ఈ ఆదేశాలను జారీ చేశారు.
కమాల్ హేడారి ప్రకటన ప్రకారం.. ఇరాన్ నిఘా సంస్థలు వాట్సాప్ సర్వర్లలో ముఖ్యంగా గూగుల్ ప్లే స్టోర్ వెర్షన్లో కొన్ని భద్రతా లోపాలను (వల్నరబిలిటీస్) గుర్తించాయి. ఈ లోపాలను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ వాట్సాప్ వినియోగదారుల డేటాను సేకరిస్తుందని, తద్వారా ఇరాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హేడారి హెచ్చరించారు. "వాట్సాప్.. ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాల గూఢచర్య సంస్థలకు చెందిన సర్వర్లను ఉపయోగిస్తోంది" అని ఆయన ఆరోపించారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపించలేదు.
మెటా ప్లాట్ఫామ్స్ అనే సంస్థ వాట్సాప్ను కలిగి ఉంది. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లకు కూడా మాతృ సంస్థ. ఇరాన్లో చాలా సోషల్ మీడియా యాప్లను ప్రభుత్వం నిషేధించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటివి అక్కడ బాగా ప్రాచుర్యం పొందాయి. నిషేధం ఉన్నప్పటికీ, చాలా మంది VPNలను ఉపయోగించి ఈ యాప్లను వాడుతున్నారు. 2022లో ప్రభుత్వం ఒక మహిళను అరెస్టు చేసినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వాట్సాప్, గూగుల్ ప్లే స్టోర్ను ఇరాన్ నిషేధించింది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
అయితే తాజాగా వాట్సాప్ను తొలగించమని ఇరాన్ ప్రజలను కోరడంపై వాట్సాప్ స్పందించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తాము ఆందోళన చెందుతున్నామని తెలిపింది. "ప్రజలకు అవసరమైన సమయంలో మా సేవలను నిలిపి వేయడానికి ఇటువంటి తప్పుడు వార్తలు సాకుగా మారుతాయి" అని వాట్సాప్ పేర్కొంది. తాము ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తున్నామని, దీని వలన మధ్యలో ఎవరూ సందేశాన్ని చదవలేరని పేర్కొంది.
"మేము మీ ఖచ్చితమైన స్థానాన్ని ట్రాక్ చేయము. ఎవరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారో లాగ్ చేయము. ప్రజలు పంపుకునే వ్యక్తిగత సందేశాలను ట్రాక్ చేయము. ఏ ప్రభుత్వానికి కూడా సమాచారాన్ని అందించము" అని వాట్సాప్ స్పష్టం చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే సందేశాలు గుప్తీకరించబడతాయి. పంపిన వ్యక్తి, అందుకున్న వ్యక్తి మాత్రమే వాటిని చూడగలరు. ఎవరైనా మధ్యలో సందేశాన్ని అడ్డుకుంటే.. వారికి అర్థం కాని గందరగోళం మాత్రమే కనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి కీ కూడా అవసరం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa